సుప్రీంకోర్టులో టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుకి చుక్కెదురైంది. అయ్యన్నపాత్రుడుపై ఫోర్జరీ కేసు దర్యాప్తుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. ఫోర్జరీ సెక్షన్లు ఐపీసీ సెక్షన్ 467 కింద దర్యాప్తు చేయవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. కేసు దర్యాప్తు సమయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు.
అసలు కేసు ఏమిటంటే.. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో తన ఇంటి నిర్మాణం కోసం సమర్పించిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లో.. తన సంతకం ఫోర్జరీ చేశారంటూ నీటిపారుదల శాఖ ఈఈ ఫిర్యాదు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను సవాల్ చేస్తూ అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ క్రమంలోనే నీటిపారుదల శాఖ జారీ చేసిన ఎన్ఓసీ విలువైన భద్రత నిర్వచనం పరిధిలోకి రాదని.. అందువల్ల సెక్షన్ 467 కేసుకు వర్తించదని హైకోర్టు పేర్కొంది. అర్నేష్ కుమార్ మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది.
ఈ క్రమంలోనే అయ్యన్నపాత్రుడుపై నమోదైన ఫోర్జరీ కేసులో ఐపీసీ సెక్షన్ 467 వర్తించదని, అర్నేష్ కుమార్ మార్గదర్శకాలను అనుసరించాలని హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ సీఐడీ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్లతో కూడిన ధర్మాసం తాజాగా అయ్యన్నపాత్రుడిపై విచారణకు అనుమతించింది.