సీబీఐ పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సీబీఐ చేపడుతున్న కేసులు కోర్టుల్లో నిలబడే పరిస్థితి కనిపించడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. అసలు ఇప్పటివరకు సీబీఐ ఎన్ని కేసులు టేకప్ చేసింది, ఎన్ని నిరూపించింది, ఎందరికి శిక్ష పడింది, ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం సీబీఐ డైరెక్టర్కు నోటీసులు జారీ చేసింది.
జమ్మూకశ్మీర్లో ఇద్దరు న్యాయవాదుల అరెస్టుకు సంబంధించిన కేసు విచారణ సమయంలో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో ఓ కేసు విషయంలో పంజరంలో చిలుకకు స్వేచ్ఛ అవసరం అంటూ.. మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను జస్టిస్ కౌల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. సీబీఐ చేపట్టిన కేసులు న్యాయస్థానాల్లో ఎందుకు నిలబడటంలేదో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.