మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్యకేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. జులై 1న గంగిరెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను ఈ ఏడాది ఏప్రిల్ 27న తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.
ఈ ఏడాది మే 5వ తేదీ లోపుగా సీబీఐ కోర్టులో లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఏడాది జూన్ 30వ తేదీలోపుగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ పూర్తి కానుందున జూలై 1న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
దీంతో హైకోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన సుప్రీం ధర్మాసనం జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.
కాగా మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని 2019 మార్కి 14న ఆయన నివాసంలో హత్య చేశారు. ఈ హత్య కేసులో గంగిరెడ్డి ఏ1 నిందితుడు. వివేకా హత్య కేసును అప్పట్లో సిట్ విచారించింది. కానీ సకాలంలో చార్జిషీటు దాఖలు కాలేదు. దీంతో ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్ట్ బెయిల్ మంజూరైంది. అనంతరం వివేకా హత్య కేసు సీబీఐ చేతికి వెళ్లింది.
ఏపీ హైకోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ విచారిస్తోంది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది.
ఈ పిటిషన్ పై విచారించిన తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది. అయితే జూలై 1న బెయిల్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడంపై వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైఎస్ సునీతా పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసింది.