సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందా…లేదా అనే అంశంపై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగాయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజయ్ ఖన్నా లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు ప్రకటించనుంది.
2007 నవంబర్ లో సుభాష్ చంద్ర అగర్వాల్ అనే ఆర్.టి.ఐ కార్యకర్త సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తులు తెలియజేయాలంటూ ఆర్.టి.ఐ. యాక్ట్ కింద దరఖాస్తు చేశారు. సుప్రీంకోర్టు ఆ సమాచారం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో సుభాష్ చంద్ర అగర్వాల్ కేంద్ర సమాచార కమిషన్ను ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తున్నందున దరఖాస్తుదారుడు కోరిన సమాచారం ఇవ్వాలని కేంద్ర సమాచార కమిషన్ సుప్రీంకోర్టును కోరింది. దీంతో 2009 లో కేంద్ర సమాచార కమిషన్ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషన్ విచారించిన ఢిల్లీ హైకోర్టు..సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫీస్ పబ్లిక్ ఆథార్టీ అయినందున సమాచార హక్కు చట్టం కిందకు వస్తుందని తీర్పు నిచ్చింది.
ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ 2010 లో సుప్రీం కోర్టు సెక్రెటరీ జనరల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల ధర్మాసం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. పారదర్శకత పేరుతో వ్యవస్థను ఎవరు నాశనం చేయలేరని చీఫ్ జస్టిస్ రంజన్ గొగాయ్ గతంలో వ్యాఖ్యానించారు.