ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజు కొనసాగుతున్నాయి. వాయిదా తీర్మానం కోరుతూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పెరిగిన విద్యుత్ చార్జీలపై టీడీపీ వాయిదా తీర్మానం కోరింది.
అయితే సభ వాయిదాకు ముందే వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ చేస్తున్న ఆందోళనల మధ్యే సభలో డిమాండ్స్ ను మంత్రులు ప్రవేశపెడుతున్నారు. ఈక్రమంలోనే మోటర్లకు మీటర్లు.. రైతులకు ఉరితాళ్లు అంటూ ప్లకార్డులతో టీడీపీ నిరసన చేపట్టింది.
6 వేల కోట్ల కుంభకోణం.. మోటర్లకు మీటర్లు అంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. స్పీకర్ పోడియంను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. కాసేపు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ 11 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెన్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ 11 మందిలో గనబాబు, వెలగపూడి, రామకృష్ణ, అచ్చెన్నాయుడు, నిమ్మల చిన్నరాజప్ప, ఆదిరెడ్డి భవాని తదితరులను వరసగా ఆరవ రోజు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేసి బయటకు పంపించారు.
అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు నుంచే వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించడానికి వచ్చిన గవర్నర్ ను స్పీకర్ చాంబర్ లో వెయిట్ చేయించారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఈక్రమంలో ఆరోపణలు చేసిన కారణంగా 12 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. దీంతో స్పీకర్ తీరుకు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మొత్తానికి అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ల పర్వం కొనసాగుతూనే ఉంది.