ఏపీలో కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో వేదికను ఏర్పాటు చేసి.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంగ్ల భాష అక్షరమాలను అనుసరించి మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయింది.
తొలుత సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణం చేయగా.. కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా.. అల్లా సాక్షిగా అంటూ తెలుగులో ప్రమాణం చేశారు. ఆదిమూలపు సురేష్ ఆంగ్లంలో ప్రమాణం చేశారు. అనంతరం దైవసాక్షిగా అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారాన్ని ప్రారంభించారు.
ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత కొత్త మంత్రులు.. వేదికపైనున్న సీఎం జగన్ తో పాటు.. గవర్నర్ ల కాళ్లు మొక్కి నమస్కారాలు చేశారు. గుడివాడ అమర్నాథ్ ప్రమాణం తర్వాత సీఎంకు సాష్టాంగ నమస్కారం చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. జోగి రమేశ్ మోకాళ్లపై కూర్చుని మరీ జగన్ కు అభివాదం తెలుపుకున్నారు. నారాయణ స్వామి కూడా జగన్ కు పాదాభివందనం చేసుకున్నారు.
వారితో పాటు.. బూడి ముత్యాల నాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుమ్మనూరు జయరామ్, కాకాణి గోవర్ధన్రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, ఉష శ్రీచరణ్, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్, పీడిక రాజన్నదొర, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజని లు మంత్రులుగా ప్రమాణం చేశారు.
ఇదిలా ఉంటే.. సీఎం జగన్ కు ముఖ్య అనుచరులుగా పేరొందిన కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ యాదవ్ లకు నూతన మంత్రి వర్గంలో స్థానం లభించకపోవడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఆళ్ల నానికి సైతం అవకాశం దక్కకపోవడంతో ముగ్గురు నాని లకు మొండి చెయ్యి ఎదురైందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎవరెవరికి ఏఏ శాఖలు ఇస్తారనేది ఆసక్తిగా మారింది.