ఆనాడు సైరా నరసింహా రెడ్డి తనకు అన్యాయం జరిగిందని బ్రిటిష్ రాజ్యం మీద పోరుకు సిద్దమయ్యాడు…ఈనాడు నరసింహా రెడ్డి వారసులు మెగా కుటుంబం మీద తిరుగుబాటు బాట పట్టారు.
తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత కథ నేపథ్యంగా తెరకెక్కుతున్న సైరా సినిమాపై, ఉయ్యలవాడ వారసులు జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు. నరసింహా రెడ్డి వారసులపై తప్పుడు కేసులు బనాయించారని వారు ఆరోపిస్తున్నారు. మోసపూరిత మాటలతో మోసం చేసిన ..కొణిదల ప్రొడక్షన్ అధినేతలు చిరంజీవి, రాంచరణ్ ల మీద కేసు పెట్టారు. సినిమా మొదలు పెట్టినప్పుడు ఉయ్యాలవాడ కుటుంబీకులకు సాయం చేస్తానని రామ్ చరణ్ చెప్పారు. నరసింహా రెడ్డి వారసులు 11మంది వున్నారని, ప్రతి కుటుంభానికి ఆర్ధిక సహాయం చెయ్యడమే కాకుండా, వారిని వారసులుగా ప్రపంచానికి పరిచయం చేస్తానని చెప్పారని అన్నారు. దాదాపు మూడువందల కోట్ల భారీ బడ్జెట్ తో ఒక తిరుగుబాటు వీరుని కథ చెప్పడానికి ముందుకు వచ్చిన నిర్మాతలు, అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఉయ్యాలవాడ వారసుడు దస్తగిరి తొలి వెలుగుకు చెప్పారు. రాజకీయ కారణాలతో ఎవరో వ్యక్తిని ఉయ్యాలవాడ వారసుడిగా చెప్పడం అన్యాయం అని అన్నారు. అడగడానికి చిరంజీవి ఇంటికి వెళ్తే వారిమీద తప్పుడు కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ లో పెట్టారని అన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఆనాడు ఉయ్యాలవాడకి చేసిన అన్యాయానికి, ఈరోజు కొణిదెల కుటుంబం చేస్తున్న అన్యాయానికి తేడా ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.
మరో పక్క, కొణిదెల ప్రొడక్షన్స్ వారు మాత్రం టీజర్ రిలీజ్ కి కూడా అక్రమంగా టికెట్ పెట్టి, ప్రతి టికెట్ కు 200 రూపాయిలు ప్రేక్షకుల నుంచి వసూలు చేసారు. తొలి స్వతంత్ర సమరయోధుడు కథను అడ్డం పెట్టుకొని సొమ్ము చేసుకోవడమే కాకుండా, ఆ కుటుంభీకులను బెదిరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఆ కుటుంబంలో పుట్టుంది మేము, ఆ వీరుడి రక్తం పంచుకున్నది మేము, మీకెందుకు ఇవ్వాలి ఆ కథ అని అడగడంలో తప్పే లేదనిపిస్తుంది!