– మెడికల్ కాలేజీల చుట్టూ వివాదం
– ట్విట్టర్ లో గవర్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు
– రెడ్కో ఛైర్మన్ కౌంటర్ ట్వీట్
– రీకౌంటర్ ట్వీట్లతో పెరిగిన హీట్
మరోసారి తెలంగాణ రాజకీయాలు గవర్నర్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ట్వీట్ వార్ తో హీటెక్కుతున్నాయి. తెలంగాణకు మెడికల్ కాలేజీల కేటాయింపులపై ట్వీట్లు, కౌంటర్లు కలకలం రేపుతున్నాయి. ఆదివారం తెలంగాణ మెడికల్ కాలేజీలపై గవర్నర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్లలో దేశంలో దాదాపు 300 నుంచి 700 కాలేజీలను నిర్మిందని.. పీఎంఎస్ఎస్వై పథకంపై తమిళిపై ప్రశంసలు కురిపించారు.
ఈ నేపథ్యంలో తమిళి సై ట్వీట్ కి ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ మరి తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు ఇచ్చారు.. అని ప్రశ్నించారు. దీనికి తమిళిసై స్పందిస్తూ పీఎంఎస్ఎస్వై పథకం కింద ప్రతి రాష్ట్రం కొత్త మెడ్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు.. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని పిలిచిందన్నారు. కానీ, కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పినట్టుగా సకాలంలో దరఖాస్తు చేసుకోవడంలో తెలంగాణ విఫలమైందని గవర్నర్ విమర్శించారు.
తెలంగాణకు ఓకే ఏడాదిలో 11 మెడికల్ కాలేజీలు వచ్చాయని.. కానీ, వారు ఆలస్యంగా నిద్రలేస్తే ఎలా అంటూ గవర్నర్ ఎద్దేవా చేశారు. దీనికి స్పందించిన బీఆర్ఎస్ అంతే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. గవర్నర్ వ్యాఖ్యలపై రెడ్కో ఛైర్మన్ వై సతీష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గవర్నర్ ట్వీట్లు ప్రచారం తప్ప మరేమీ కాదని, అలాంటి గౌరవనీయమైన పదవిని చేపట్టే హక్కు ఆమెకు లేదన్నారు.దీంతో, మరోసారి గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
కాగా ఇటీవల పెండింగ్ బిల్లుల అంశంలోనూ గవర్నర్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. పెండింగ్ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ అంశంపై స్పందించిన గవర్నర్, సీఎస్ కి చురకలంటిస్తూ ట్వీట్లు చేశారు. ఢిల్లీ కంటే రాజ్ భవన్ దూరమా.. అంటూ కామెంట్స్ చేశారు. సరైన పద్ధతిలో వచ్చి మాట్లాడి సెటిల్ చేసుకుంటే సరిపోయేది కదా అని అన్నారు.
ఈ విషయంలో గవర్నర్ తీరుపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. గవర్నర్ కు బానిసలు ఎవరూ లేరని, బిల్లుల ఆమోదానికి పైరవీలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం తెలంగాణ సర్కార్ వద్ద అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోద ముద్ర వేసిన 8 బిల్లుల్లో ఒక్క బిల్లును మాత్రమే గవర్నర్ ఆమోదించారు. ఏడు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే.. ఈ పెండింగ్ బిల్లులను గవర్నర్ ఆమోదం చేసేట్లుగా ఆదేశించాలని తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేసింది. అయితే సుప్రీం కోర్టు హోలీ సెలవుల తరువాత ఆ పిటిషన్ విచారణకు రానుంది. మొత్తానికి ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ మళ్లీ షురూ అయిన ఈ వార్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.