కల్కి భగవాన్ ఆశ్రమాలపై తమిళనాడుకు చెందిన ఐటీ బృందం అధికారులు మూకుమ్మడిగా దాడులకు దిగారు. చిత్తూరు జిల్లా వరదాయపాళెం కేంద్రంగా నడుస్తున్న కల్కి ఆశ్రమం పై నాలుగు ఐటీ బృందాలు దాడులు జరిపి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో తమిళనాడు నేమంలో కల్కి ఆశ్రమంపై కూడా ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. కల్కి అనుబంధ సంస్థలపై మరో ముప్పై చోట్ల ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా కల్కి ఆశ్రమ నిర్వాహకులు ఆధ్యాత్మిక పరంగా వివిధ సేవలకు గాను భక్తుల నుంచి సేకరిస్తున్న విరాళాల సొమ్మును భూముల కొనుగోలు, డిపాజిట్ల వంటివాటిపై దుర్వినియోగం అవుతున్నట్టు తమిళనాడు ఐటీ అధికారులకు ఫిర్యాదు అందినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తమిళ నాడు ఐటీ అధికారుల బృందం కల్కి భగవాన్ ఆశ్రమాలపై దాడులకు పూనుకున్నట్లు తెలిసింది. దీంతో బుచ్చినాయుడు కండ్రిగ, వరదాయపాళెం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట, తడ మండలాల్లో కల్కి భూ వ్యవహారానికి సంబంధించిన బినామీ తంతు వంటి వాటిపై కలకలం రేగింది. ఐటీ అధికారుల తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై డేగ కన్నేసింది. తమిళనాడు ఐటీ అధికారుల రంగప్రవేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తర్వాత ఎటువంటి చర్యలతో ముందుకు వెళ్లాలో ఆలోచనలో పడింది.