తెలంగాణ రాజకీయాలు ఎంత కాదన్నా.. కర్ణాటక ఫలితాలతో బాగానే ప్రభావితం అవుతున్నాయి. ఇప్పుడు ఈ సెగ అధికార పక్షం బీఆర్ఎస్ కి పాకింది. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిందే ఇక్కడ కూడా పునరావృత్తం అవుతుందని వికారాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఒక గుర్తుపైన గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వారందరిని ప్రజలు తిరస్కరిస్తారన్నారు. తాను కారు గుర్తు పైనే గెలిచానని, వేరే పార్టీలో నుంచి గెలిచి రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో పాల్గొని సక్సెస్ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజాక్షేత్రంలోకి పల్లెకు పల్లె పట్నం కార్యక్రమాన్ని జూన్ 21 నుంచి నిర్వహిస్తామని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో తాండూరు నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని, సీఎం కేసీఆర్ టికెట్ ఇస్తారని మహేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అంతే కాదు సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని పట్నం మహేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అయితే గత ఎన్నికల్లో కారు గుర్తు అనుకొని కొందరు ట్రక్కు గుర్తుకు ఓటేయడంతో తాను ఓడిపోయాయని ఆయన చెప్పారు.
అయితే కొన్నాళ్ల నుంచి ఈ నియోజక వర్గంలో వర్గ పోరు భగ్గుమంటోంది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్సెస్ పట్నం మహేందర్ రెడ్డిగా ఫైట్ కొనసాగుతుంది. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే 2018 ముందస్తు ఎన్నికల్లో తాండూరులో పట్నం మహేందర్ రెడ్డి పై కాంగ్రెస్ అభ్యర్థి అయిన పైలెట్ రోహిత్ రెడ్డి గెలిచారు. తరువాత ఆయన కారెక్కెశారు.