ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం బహిరంగ లేఖ రాశారు. ఏపీలో ఈ నెల 13న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓటర్లకు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వానికి మీరే బుద్ధి చెప్పాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో పీడీఎఫ్ తో అవగాహనకు వచ్చామని తెలిపారు. రెండో ప్రాధాన్యత ఓటును పీడీఎఫ్ కు వేయాలని చెప్పారు.
ప్రలోభాలతో వైసీపీ అక్రమ విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు చిరంజీవిరావు (ఉత్తరాంధ్ర), కంచర్ల శ్రీకాంత్ (తూర్పు రాయలసీమ), భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (పశ్చిమ రాయలసీమ)లను గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
2014లో అధికారంలోకి వచ్చాక అనేక క్లిష్ట పరిస్థితులు, సవాళ్లను అధిగమించి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చామని వివరించారు. నేడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం సరిగా ఇచ్చే పరిస్థితి కూడా లేదని జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు చంద్రబాబు.