ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన జీవో నెంబర్ 1పై హైకోర్టు సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై శుక్రవారం సుప్రీంలో విచారణ జరిగింది. జీవో నెం.1పై తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పష్టతపై టీడీపీ అధినేత చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. జీవో నెం.1పై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు చెప్పడం ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదన్నారు. హైకోర్టులో విచారణ ఉండగా, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జీవో నెం.1ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సైకో తరహా నిర్ణయాలతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు చంద్రబాబు.
రాష్ట్రంలో రోడ్లపై సభలు, సమావేశాలు, రోడ్ షోలకు సంబంధించిన అనుమతులపై ప్రభుత్వం జీవో నెం.1 తీసుకురాగా, ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా, జీవో నెం.1ను హైకోర్టు ఈ నెల 23 వరకు సస్పెండ్ చేసింది. అదే రోజున హైకోర్టులో తదుపరి విచారణ జరగనుంది. ఈలోపే ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది.