విజయవాడ మైనర్ బాలిక ఆత్మహత్య ఏపీలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తూ.. టీడీపీ నేత వినోద్ జైన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలో ఇటీవల 9వ తరగతి చదువుతున్న బాలిక అపార్ట్ మెంట్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
టీడీపీ నేత వేధింపులు తాళలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ బాలిక సూసైడ్ నోట్ రాయడం సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక ఉండే అపార్ట్ మెంట్ లోనే నివాసం ఉంటున్న టీడీపీ నేతను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాకుండా అతడి ఫ్లాట్ ను కూడా సీజ్ చేశారు.
నిందితుడు వినోద్ జైన్ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 37వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేశాడు. గత రెండు నెలల నుంచి బాలికను వేధిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా పలుమార్లు లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడని బాలిక కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
అతడి వేధింపులు తట్టుకోలేక బాలిక ఆత్మహత్య చేసుకుందని వారు చెప్తున్నారు. ఆత్మహత్యకు ముందు టెర్రస్ పై 20 నిమిషాల పాటు బాలిక అటూ ఇటూ తిరుగుతూ సీసీటీవీ కెమెరాల్లో కనిపించిందని పోలీసులు వెల్లడించారు. ఫుటేజ్ హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టినట్టు తెలిపారు.