ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వర్ రావు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. రోడ్లపై సభలు, ర్యాలీలు నిర్వహించకుండా నిషేధం విధిస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నాలుక గీసుకోవడానికి కూడా పనికి రాదని విమర్శించారు. ఈ జీవోను అమలు చేయాలనుకుంటే మంగళవారం రాజమండ్రిలో జరగనున్న జగన్ సభ దగ్గర నుంచి అమలు చేయాలని చీఫ్ సెక్రటరీని, హోమ్ సెక్రటరీని ఆయన డిమాండ్ చేశారు.
రాజమండ్రి మున్సిపల్ గ్రౌండ్ నుంచి సభా ప్రాంగణం వరకు 3 కిలోమీటర్ల రోడ్ షోను జగన్ పెట్టారని.. ముందు దాన్ని ఆపండని తెలిపారు. ఈ జీవోను ఫస్ట్ మీ దగ్గర నుంచే మొదలు పెట్టండని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి జీవో ఇస్తే నీవు పాదయాత్ర చేసేవాడివా? అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. నీ బహిరంగ సభలు రోడ్లు మీద పెట్టావో, గ్రౌండ్ లో పెట్టావో, ఎవరి ఇంటి మీదైనా పెట్టావో ఒకసారి తాడిపల్లి ప్యాలస్ లో వీడియోలు వేసుకుని చూసుకో అన్నారు.
అధికారం ఉంది కదా అని ప్రతిపక్షాలే లేకుండా చేస్తానంటే కుదిరని పని అన్నారు. ఒక పార్టీ గొంతు నొక్కడానికి అన్ని పార్టీల మెడలకు ఉరితాడు వేయాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. జగన్ రాజమండ్రి సభకు ఎలా అనుమతినిచ్చారని ప్రశ్నించారు. తాము యథావిధిగా సభలు, ర్యాలీలను నిర్వహించి తీరుతామని ఉమా తెలిపారు.
రాబోయే రోజుల్లో మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు మీరు ఇదే మాట్లాడాలి అంటూ తాడేపల్లి ప్యాలస్ నుంచి నోట్ వస్తుందని.. అప్పుడు మనం అదే మాట్లాడాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వస్తున్న స్పందన నేపథ్యంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఇచ్చిన జీవోను తాము లెక్కచేయబోమని స్పష్టం చేశారు బోండా ఉమా.