ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో అద్దె గదులకు రేట్లు పెంచడం దారుణమన్నారు. శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం నిర్మించిన వసతి గృహాల రేట్లను భారీగా పెంచి భక్తులపై మరింత అధిక భారం మోపడం దురుద్దేశపూరితమన్నారు.
అంతకుముందు లడ్డూ రేట్లు, ఇటీవల బస్ ఛార్జీలు, ఇప్పుడు వసతి గదుల రేట్లు పెంచి తిరుమల వెంకన్నకు భక్తులకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రూ.50 నుంచి రూ.200 ఉండే అద్దె గదుల రేట్లను రూ.750 నుంచి రూ.2,300కు పైగా పెంచడం దుర్మార్గమని మండిపడ్డారు. భగవంతుడిని భక్తులను దూరం చేయడానికి గత మూడేళ్లుగా కొనసాగుతున్న చర్యల్లో భాగమే అద్దె గదుల రేట్ల పెంపు అని విమర్శలు చేశారు.
ప్రతి సంవత్సరం టీటీడీకి వేలాది కోట్ల ఆదాయం, ఆస్తులను కలిగిస్తున్న భక్తులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించాల్సిన టీటీడీ.. దానికి విరుద్ధంగా వసతి గృహాలను భక్తులకు అందుబాటులో లేని విధంగా చేయటం దారుణమన్నారు. ఇలాంటి చర్యల వల్ల బాలాజీని దర్మించుకునే కోట్లాది భక్తుల మనసుల్లో అపోహాలు, అనుమానాలు కలిగే అవకాశం ఉందన్నారు.
గత మూడున్నరేళ్లుగా బాదుడే బాదుడు అంటూ పన్నులు పెంచి ప్రజలపై మోయలేని భారాలను మోపిన జగన్ సర్కార్.. ఇప్పుడు తిరుమలను కూడా వ్యాపార సంస్థగా మార్చి భగవంతుడిని భక్తులకు దూరం చేయడాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పెంచిన అద్దె గదుల రేట్లను తిరుపతి తిరుమల దేవస్థానం వెంటనే విరమించుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు కళా వెంకట్రావు.