ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ మరోసారి లేఖ రాశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రైల్వే స్థలాలకు సంబంధించిన అంశంపై లోకేష్ లేఖలో పేర్కొన్నారు. తాడేపల్లిలో రైల్వేస్థలాల్లో కొందరు నివసిస్తున్నారు. వారికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని గతంలో ప్రభుత్వ పెద్దలు హామీలు ఇచ్చారు.
ఈ మేరకు..వారు వేరేచోట ఇళ్లు కట్టేవరకు.. వారు నివసిస్తున్న ఇళ్లును రైల్వే అధికారులు కూల్చకుండా సమయం ఇచ్చేలా తక్ష ణమే చర్య లు తీసుకోవాలంటూ లేఖలో పేర్కొన్నారు. నలభై ఏళ్లుగా అక్కడే ఇళ్లు కట్టుకొని నివసిస్తున్న అట్టడుగువర్గాలకి చెందిన నిరుపేదలను ఒక్క రోజులో ఇళ్లు ఖాళీ చేయాలని రైల్వే అధికారులు నోటీసులు జారీ చేయడం సరికాదన్నారు లోకేష్.
దీనిపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరముందన్నారు. 2019 ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ఎమ్మెల్యే, పలువురు వైసీపీ నాయకులు ఈ రైల్వే స్థలంలో ఉన్న పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారని లేఖలో గుర్తుచేశారు. కూలి పనులకు వెళ్తే కానీ కూడు దొరకని నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 650 కుటుంబాల సమస్యని వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.
ప్రభుత్వం తరఫున వైసీపీ ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు 650 మందికి వేరే చోట ఇళ్లు కట్టి తరలించేవరకూ ఇక్కడే నివాసం ఉండేలా రైల్వే అధికారులను ఒప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సీఎం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు లోకేష్.