చంద్రబాబు ఐదేళ్ల పాలనపై వైసీపీ ప్రభుత్వం సిట్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. మహామేత అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు పై 26 పైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, నలుగురు అధికారులతో విచారణలు 1 సీబీసీఐడీ విచారణ చేయించారు. అప్పుడు ఏమైందో అందరికి తెలుసు. గత 9 నెలలుగా, మంత్రుల సబ్ కమిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్ విచారణ, సీఐడీ విచారణ, ఐటీకి, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చెయ్యమన్నారు. ఇప్పుడు ఏమైందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నారా లోకేష్.
ఇప్పుడు కొత్తగా సిట్ అంటున్నారని, అది కూడా బాబాయ్ మర్డర్లు లాంటి కేసులను విచారణ చేయాల్సిన అధికారులతోనని లోకేశ్ విమర్శించారు. ఇక్కడ యువమేత ఆత్రం అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. సాధించేది ఏమీ లేనప్పుడు సిట్ లతో కాలక్షేపం చేయడమే అవుతుందన్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు పై విమర్శలు చేసిన లోకేష్ దీనికి తోడు గతంలో పత్రికల్లో వచ్చిన వార్తలను షేర్ చేశారు.
Advertisements