తెలుగు దేశం జాతీయ కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర నేటితో 33 రోజులకు చేరుకుంది. ఈ యాత్ర ఈరోజు పుంగనూరులో కొనసాగుతుంది. ఈ సందర్భంగా లోకేశ్ అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. ఈ సభలో ఆయన మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి పై విరుచుకుపడ్డారు. పెద్ది రెడ్డి ని ఇక్కడ పెద్దాయన అని పిలవాలంట..ఎందుకు భూములు దోచిందానికి పెద్దాయన అని పిలవాలా? మట్టి మాఫియా చేసినందుకు పెద్దాయన అని పిలవాలా? ఇసుక దోపిడీ చేసిన దానికి పెద్దాయన అని పిలవాలా? ఎందుకు పెద్దాయన అని పిలవాలి?’’ అని ప్రశ్నించారు.
ప్రస్తుతం ఉన్న రోజుల్లో తాగే నీరు కూడా లీటరు రూ. 20 అమ్ముతుంటే.. పుంగనూరులో మాత్రం మంత్రి గారు లీటర్ పాలు రూ. 16 కి కొంటున్నారు. చల్లా బాబు పోరాటం చేయడం వల్లే ఆ ధరను ఇప్పుడు పెంచినట్లు తెలిపారు. అయినా బయట పాల డైరీలు ఇచ్చే ధర కంటే ఆరు రూపాయలు ఇప్పటికీ తక్కువ ఇస్తూ పాడి రైతులను దోచేస్తున్నారని మండిపడ్డారు.
జగన్ రాష్ట్రంలో అమూల్ డైరీని తీసుకొచ్చారని..పుంగనూరులో మాత్రం అమూల్ డైరీ లేదన్నారు. పాపాల పెద్దిరెడ్డి శివశక్తి డైరీ కోసం అమూల్ ని పుంగనూరుకు తీసుకురాలేదని లోకేష్ విమర్శించారు. పాడి రైతులను కాదు మామిడి రైతులను కూడా పాపాల పెద్దిరెడ్డి దోచుకుంటున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డి అనుచరులు వెంకట్రెడ్డి, నాగభూషణం, భాస్కర్లు అమాయకుల భూముల మీద కన్నేసి భూములు కొట్టేస్తున్నారన్నారు. అటవీశాఖ భూమిని ఇప్పటికే కబ్జా చేసేశారని తెలిపారు.
ఇలా పదివేల కోట్ల రూపాయలు పాపాల పెద్దిరెడ్డి దోచారని వ్యాఖ్యలు చేశారు. వడ్డీతో సహా కక్కించి పుంగనూరు ప్రజల కోసం ఆ డబ్బుని ఖర్చు పెట్టిస్తానని అన్నారు. పాపాల పెద్దిరెడ్డిని శాశ్వతంగా ఇంటికి పంపుతామని.. తగ్గేది లేదు ఏం చేస్తావో చేసుకో పెద్దిరెడ్డి అంటూ సవాల్ విసిరారు. రిజర్వాయర్ కోసం బలవంతంగా భూములు లాక్కున్నారని.. ఇప్పటివరకు రైతులకు నష్టపరిహారం చెల్లించలేదని తెలిపారు.
తాము అధికారంలోకి వచ్చాక మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తామని.. పుంగునూరు, పీలేరు, మదనపల్లిని మదనపల్లి జిల్లాలో కలుపుతామన్నారు. తాను జిల్లా దాటిన తర్వాత చల్లా బాబు ప్రతి ఇంటికి వస్తారని.. ఆయన్ను ఆశీర్వదించాలని లోకేష్ కోరారు.