తెలుగు దేశం పార్టీ నేతలపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఎంపీ విజయ సాయిరెడ్డి, గుర్రంపాటి దేవేందర్ రెడ్డిలపై సీఐడీ ఏడీజీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏడీజీకి ఆయన లేఖ రాశారు.
సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై వైసీపీ నేతలు నిస్సిగ్గుగా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నారా లోకేశ్ పై
ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గుర్రంపాటి దేవేంద్ర రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. దేవేందర్రెడ్డి చెబుతున్నట్టుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో 273, 274, 275, 276 సర్వే నంబర్లే లేవన్నారు.
వైసీపీ నాయకులు ప్లాట్ నెం. 3, రోడ్ నంబర్. 12, బంజారాహిల్స్, ఎమ్మెల్యే కాలనీ, హైదరాబాద్ నుంచి నిరాధారమైన ఆరోపణలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక టీడీపీ నాయకులపై హత్యారాజకీయాల పేరుతో ఎంపీ విజయసాయి కూడా అసత్య ప్రచారాలు చేశారని పేర్కొన్నారు.
దీనిపై ఫిర్యాదు చేసేందుకు 3 ఆగస్టు 2022న టీడీపీ నాయకులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబులు మంగళగిరి రూరల్ సీఐ భూషణంని సంప్రదించారని చెప్పారు. కానీ తమ నాయకుల పట్ల సీఐ బాధ్యతారాహత్యంగా ప్రవర్తించారని తెలిపారు.
సీఐ తన ప్రాథమిక బాధ్యతలను విస్మరించి తమ నాయకులతో అసభ్యకరంగా దుర్భాషలాడారని మండిపడ్డారు.
Advertisements
ఇప్పటి వరకు తాము చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న దేవేంద్ర రెడ్డి, విజయసాయి రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఫిర్యాదు దారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు సీఐ భూషణంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.