తెలుగుదేశం… ఆటుపోట్లు అలవాటుగా మలుచుకున్న పార్టీ.. ! కొన్ని సందర్భాల్లో అధికారాన్నే కాదు.. అతి ముఖ్యమైన నేతలనూ పొగొట్టుకుంది. తెలుగుదేశంలోని చాలా ముఖ్యనేతలు అసహజ పరిస్థితుల్లోనే చనిపోయారు. తాజాగా కోడెల శివప్రసాద్ మృతి పార్టీలో మరోసారి విషాదం నింపింది.
శివ ఏచూరి, విజయవాడ
తెలుగుదేశం అంటే డైనమిక్ లీడర్లకు పెట్టింది పేరు. 1983లో రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది యువకులను నాయకులుగా తీర్చిదిద్దింది ఆ పార్టీ. అయితే పార్టీ దురదృష్టమో మరొకటో కానీ.. అద్భుత రీతిలో ఎదిగిన నేతల్లో చాలామంది అకాల మరణం పాలయ్యారు. తెలుగుదేశంలో అగ్రనేతగా ఎదిగిన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అనుమానాస్పద మరణంతో తెలుగుదేశంలో అర్థంతరంగా రాలిపోయిన నేతలపై చర్చ జరుగుతోంది. నాటి జమ్మలమడుగు శివారెడ్డి నుంచి నేటి కోడెల వరకూ ఈ జాబితా పెద్దగానే ఉంది. శివారెడ్డితో మొదలు మాజీమంత్రి, జమ్మలమడుగు టీడీపీ నేత గుల్లకుంట్ల శివారెడ్డిని ప్రత్యర్థులు 1993లో హైదరాబాద్లోని సత్యసాయి నిగమాగమం దగ్గర హత్య చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత, రైతు నాయకుడు, మాజీమంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి తన నియోజకవర్గం పొన్నూరు పరిధిలోని చేబ్రోలు దగ్గర రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయన స్థానంలోనే ఆయన కుమారుడు ధూళిపాళ్ల నరేంద్ర ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు తెలుగుదేశంలో ముఖ్యనేత, అప్పటి హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి నక్సల్స్ మందుపాతరకు బలయ్యారు. తెలుగుదేశంలో కీలకనేతగా ఎదుగుతున్న తరుణంలో ఆయన అర్థంతరంగా తనువు చాలించారు. ఇక కృష్ణాజిల్లా రాజకీయాల్లో వేగంగా దూసుకొచ్చిన యువ కెరటం దేవినేని రమణ. దూకుడైన రాజకీయనేతగా ఉన్న దేవినేని రమణను చంద్రబాబు మొదటిసారి గెలవగానే మంత్రిని చేశారు. మాధవరెడ్డి చనిపోయిన కొన్నాళ్లకే రమణ కూడా రైలు ప్రమాదంలో చనిపోయారు. 1999లో గోదావరి ఎక్స్ప్రెస్ వరంగల్ జిల్లాలో పట్టాలు తప్పిన ప్రమాదంలో ఆయన మృతి చెందారు. ఎంతో రాజకీయ భవిష్యత్ ఉన్న రమణ చిన్న వయసులోనే కాలం చేశారు. రమణ స్థానంలో దేవినేని ఉమ రాజకీయ ప్రవేశం చేశారు. పరిటాల రవీంద్ర రాయలసీమలో తెలుగుదేశం ముఖ్యనేత. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఫ్యాక్షన్ పగలకు బలైపోయారు. 2005 జనవరి 24వతేదీన అనంతపురం జిల్లా పార్టీ కార్యాలయంలోనే ఆయనపై కాల్పులు జరిపి హతమార్చారు. బాలయోగి, ఎర్రన్నాయుడు తెలుగుదేశం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన ఇద్దరు నేతలూ అర్థంతరంగా ప్రమాదాల్లో చనిపోవడం ఆ పార్టీకి దురదృష్టకరమైన చేదు జ్ఞాపకంగా మిగిలింది. లోక్సభ స్పీకర్గా ఎంపికై జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న బాలయోగి అనూహ్యంగా కృష్ణా జిల్లా కైకలూరులో 2002లో హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఇక కేంద్ర కేబినేట్ మంత్రిగా పనిచేసి పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఉత్తరాంధ్ర నేత ఎర్నన్నాయుడు సైతం ప్రమాదంలో చనిపోయారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వెళుతుండగా 2012 నవంబర్ 2న తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎర్రన్న కాలం చేశారు. ఇక తెలుగుదేశం పార్టీలో మైనారిటీ నేతగా గుంటూరు ఎంపీగా పనిచేసిన లాల్జాన్ బాషా 2013లో నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. హరికృష్ణ తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు తనయుడు. మాజీ మంత్రి, పొలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చింది. 2018లో నార్కట్పల్లిలో జరిగిన ప్రమాదంలో హరికృష్ణ చనిపోయారు.
ఇప్పుడు శివప్రసాదరావు మరణం. మంత్రిగా, స్పీకర్గా పనిచేసి సీనియర్ నాయకుడిగా ఉన్న కోడెల అనుకోని రీతిలో చనిపోవడాన్ని తెలుగుదేశం వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. మిగతా మరణాలతో పోల్చితే ఇది కాస్త విభిన్నం. ప్రత్యర్థి పార్టీ, ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుగుదేశం శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనలే కాదు స్వయంగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మృత్యుముఖం నుంచి బయటకు వచ్చారు. 2003లో అలిపిరిలో ఆయనపై నక్సల్స్ క్లైమోర్మైన్స్తో దాడి చేశారు. ఈ ప్రమాదం నుంచి చంద్రబాబు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.