భారీ వర్షాలకు ఏపీలోని లోతట్టు గ్రామాలు మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కోనసీమ జిల్లాలో పర్యటించారు. అయితే.. ఈ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. రాజోలు మండలం సోంపల్లి రేవులో బోటు దిగుతుండగా నీటిలో పడిపోయారు టీడీపీకి చెందిన 15 మంది నేతలు. చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది.
పంటు ఢీకొనడంతో పడవలో ఉన్న నేతలు నదిలో పడిపోయారు. దేవినేని ఉమ, పితాని సత్యనారాయణ, రాధాకృష్ణ, అంగర రామ్మోహన్, మంతెన రామరాజు నీటిలో పడి తడిసి ముద్దయ్యారు. ఇందులో పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పోలీస్ అధికారులు, మీడియా సిబ్బంది కూడా నదిలో పడిపోయారు.
అప్రమత్తమైన స్థానికులు, మత్స్యకారులు లైఫ్ జాకెట్ల సాయంతో వారిని సురక్షితంగా కాపాడారు. నదికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారు.
మానేపల్లిలో వరద ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తర్వత అందరూ ఒడ్డుకు చేరుకున్నారు.