ఎమ్మెల్సీ బీటెక్ రవికకి పులివెందుల కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 18 వరకు రిమాండ్ విధించటంతో పోలీసులు ఆయన్ను కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
2018 మార్చి 4న పులివెందులలో జరిగిన టీడీపీ, వైసీపీ వర్గాల ఘర్షణ కేసులో నిందితుడుగా ఉన్న బీటెక్ రవిని పోలీసులు ఆదివారం మధ్యాహ్నం చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కడప జిల్లా పోలీసులు బీటెక్ రవిని అర్ధరాత్రి పులివెందుల తీసుకొచ్చారు. ఉదయం 7.30 గంటల సమయంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండు విధించారు.
బీటెక్ రవిని చూసేందుకు ఆయన భార్య, కుటుంబ సభ్యులు నిన్న అర్థరాత్రి నుంచి వేచి చూస్తున్నారు. అయినా రవిని చూసేందుకు అనుమతి ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.