ఏపీ బడ్జెట్ సమావేశాల్లో ఆందోళన పర్వం కొనసాగుతోంది. శనివారం సభ ప్రారంభం అయిన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. అనంతరం స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరపాలని పట్టుబట్టారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా.. సీఎం జగన్ సడన్ గా ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా ని కలసి.. ఎప్పటిలాగా విభజన హామీల అమలుపై వినతిపత్రం ఇచ్చారు. ఈ అంశంపైనే టీడీపీ ఆందోళనకు దిగింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది.
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనల వివరాలు సభ ముందు ఉంచాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. సీఎం జగన్ చాలా సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, హోమ్ మంత్రి అమిత్ షాను కలిసినా.. ఆ విషయాలు ప్రజలకు చెప్పడంలేదని, అంత రహస్యమేంటని ప్రశ్నించారు టీడీపీ ఎమ్మెల్యేలు. కనీసం ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు కూడా తెలియజేయడం లేదని మండిపడ్డారు.
ఈసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారని, బడ్జెట్ పై జరిగే చర్చల్లో కూడా ఆయన పాల్గొనలేదని, ప్రధాని, హోమ్ మంత్రితో భేటీ వివరాలను సభ ముందు పెట్టాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఏం సాధించుకొచ్చారంటూ అసెంబ్లీలో నిరసన చేపట్టారు టీడీపీ ఎమ్మెల్యేలు.
పోలవరానికి నిధులెంత తెచ్చారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రత్యేక హోదా తెచ్చారా? అంటూ నినాదాలు చేశారు. వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ ఏమైందంటూ నిరసన తెలిపారు. అప్పర్ భద్ర ఆపారా? విశాఖ రైల్వేజోన్ తెచ్చారా? అంటూ కానినడకన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళ్లారు.