అమరావతిని కాపాడుకోవాలన్న ఆకాంక్ష రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల్లో బలంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయడు పేర్కొన్నారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభకు విశేష ఆదరణ లభించడమే దానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. పార్టీ ముఖ్యనేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో అమరావతిని నాశనం చేయడం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని ప్రజలకు మరింతగా వివరించాలని సూచించారు. పేద ప్రజల మెడకు ఓటీఎస్ ఉరితాడులా మారిందన్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అన్ని మండల కేంద్రాలు, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాల ఎదుట టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
వైసీపీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా ఇంతవరకూ ఒక్క ఇల్లూ కట్టలేదన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లనూ లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. పార్టీ నేతలంతా ఇకపై నిరంతరం క్షేత్రస్థాయి పర్యటనలతో ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు. ఓటీఎస్, నిత్యావసర ధరల పెంపు వంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టాలని చంద్రబాబు సూచించారు.