ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజలు మాట్లాడే హక్కును కోల్పోయారన్నారు. ముఖ్యమంత్రి జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ వైఖరిని ప్రజలతో పాటు పశుపక్ష్యాదులు కూడా ఇష్టపడటం లేదన్నారు.
రాష్ట్రంలో స్వతంత్ర సమరం నాటి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అసలు సొంత నియోజకవర్గం కుప్పంలో తిరిగే స్వేచ్ఛ కూడా చంద్రబాబుకు లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కుప్పంలో చంద్రబాబు పరిస్థితి చూస్తే చాలా బాధ కలిగిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పోలీసులే వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు. చెత్తబండ్లను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని.. భవిష్యత్తులో పోలీసులే చెత్త ఎత్తుతారేమో అంటూ దుయ్యబట్టారు.
రాష్ట్రంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పారు. మార్చి నెలనాటికి రాష్ట్రంలో లోకల్ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లపై తీవ్ర ఆంక్షలు విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి.