ఇండియన్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్ వన్ బౌలర్ గా మారాడు. ఐసీసీ లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వన్డే ర్యాంకింగ్స్లో ఈ ఫాస్ట్ బౌలర్ మొదటి స్థానం ఆక్రమించాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ను వెనక్కి నెట్టి సిరాజ్ మొదటి స్థానాన్ని సాధించాడు. వన్డే ఫార్మాట్ లో సిరాజ్ నంబర్ వన్ గా నిలవడం ఇదే తొలిసారి. సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ కి ఎట్టకేలకు మంచి బహుమతి లభించింది.
మహ్మద్ సిరాజ్ 2019 సంవత్సరంలో వన్డే అరంగేట్రం చేశాడు. అయితే కొంతకాలం తర్వాత అతను జట్టు నుంచి తొలగించబడ్డాడు. గత ఏడాది ఫిబ్రవరిలో పునరాగమనం చేశాడు సిరాజ్. తిరిగి వచ్చినప్పటి నుంచి సిరాజ్ 20 మ్యాచ్ లు ఆడాడు. అందులో 37 వికెట్లు సాధించాడు. ముఖ్యంగా పవర్ ప్లేలో, బ్యాట్స్ మెన్స్ ను ఇబ్బంది పెట్టాడు సిరాజ్.
ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో సిరాజ్ 9 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక బ్యాట్స్ మెన్ పై కూడా విధ్వంసం సృష్టించాడు. అదే సమయంలో, న్యూజిలాండ్ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో 4 వికెట్లు తీశాడు. స్వస్థలమైన హైదరాబాద్ లో తొలిసారి ఆడి, సత్తా చాటాడు సిరాజ్. ఈ సిరీస్ తర్వాత, సిరాజ్ ఇప్పుడు 729 రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ ప్లేస్ లో నిలిచాడు.
మరోవైపు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ 727 పాయింట్లతో రెండో స్థానంలో, కివీస్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 708 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక ఐసీసీ ర్యాంకింగ్ లో సిరాజ్ తో పాటు షమీ కూడా స్థానం సంపాదించుకున్నాడు. 11 స్థానాలు ఎగబాకి 32వ స్థానానికి చేరుకున్నాడు.