సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఓ నిత్య పెళ్ళికొడుకు బండారం బైటపడింది. మ్యాట్రిమోని సైట్స్ లో ఒంటరి మహిళలే లక్ష్యంగా ప్రేమాయణం సాగించి పెళ్ళిదాకా వచ్చేసరికి ప్లేటు పిరాయిస్తున్నాడు. తమ పరువు పోతుందన్న భయంతో మోసపోయిన వాళ్లు మౌనంగా ఉండిపోవడం ఈ తరహామోసాలు నిర్భయంగా చేయడానికి ఊతమిచ్చింది.
కానీ..ఓ మహిళ మౌనం వీడింది. ధైర్యంగా నిలబడింది. దీంతో అతని బాగోతం వెలుగు చూసింది. అతడు జైలుపాలు అవ్వాల్సి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే..సదరు మోసగాడి పేరు వంశీ. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్పల్లికి చెందిన ఇతగాడు..హైటెక్ సిటీ మాదాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు.
నెల్లూరుకు చెందిన ఓ వివాహితతో ఇతను సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెను తన ముగ్గులోకి దింపాడు. పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడల్లా..మాట దాటవేస్తూ వచ్చాడు. చివరికి పెళ్లికి నిరాకరించడంతో.. ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. అప్పుడు అతని అసలు బాగోతం బట్టబయలైంది.
వంశీకి అప్పటికే ఇద్దరు మహిళలతో వివాహం అయ్యిందని, వారికి విడాకులు కూడా ఇచ్చాడని తేలింది. అంతేకాదు.. ప్రేమ, పెళ్లి పేరుతో పలువురు మహిళల్ని మోసం చేసినట్లు కూడా వెల్లడైంది. పోలీసుల్ని అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. తన భర్త మరణించడంతో బాధిత మహిళ ఒంటరిగా ఉంటోంది.
జీవితాన్ని తిరిగి కొత్తగా ప్రారంభించాలనుకున్న ఆమె.. మ్యాట్రిమోనిలో తన వివరాలను పొందుపరిచింది. ఈ క్రమంలోనే వంశీతో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో..అతనితో సహజీవనానికి అంగీకరిచానని తెలిపింది. కానీ..అతడు ఇలా మోసం చేస్తాడని తాను అనుకోలేదని ఆమె బోరున విలపించింది. బాధితురాలు డెర్మటాలజిస్ట్గా విధులు నిర్వహిస్తుంది.