ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న స్పెషల్ ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. సీఎం జగన్ ఢిల్లీ బయలుదేరారు. అయితే సీఎం ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ స్పెషల్ ఫ్లైట్ ను తిరిగి గన్నవరం ఎయిర్ పోర్ట్ లో అత్యవసర ల్యాండింగ్ చేశారు.
సాయంత్రం 5.03 గంటలకు టేకాఫ్ అయిన విమానం 5.27 గంటలకు గన్నవరంలో తిరిగి ల్యాండ్ అయింది. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కర్టెన్ రైజర్ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉంది. అందు కోసం ఢిల్లీ పయనమయ్యారు.
ఢిల్లీ లీలా ప్యాలెన్ హోటల్ లో దౌత్యవేత్తలతో సీఎం జగన్ సమావేశమవ్వాల్సి ఉంది. అయితే ఫ్లైట్ అత్యవసర ల్యాండింగ్ అయిన వెంటనే గన్నవరం నుంచి తాడేపల్లి వెళ్లిపోయారు జగన్. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నట్లు తాజా సమాచారం .