ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ). మనిషి మేధస్సుతో మనిషి సృష్టించుకున్న కృత్రిమ మేధస్సు.దీని వ్యవహారిక నామం ‘చాట్ జీపీటీ’. దీని వినియోగం ఊహించని రీతిలో పెరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిర్వహించే సివిల్స్ పరీక్షలతో పాటు లా, ఎంబీఏ పరీక్షలను రాసి కొన్నిట్లో మెరుగైన ఫలితాలు సాధించి ఔరా అనిపించింది. ఇక తాజాగా పంజాబ్-హరియాణా హైకోర్టుకు సైతం న్యాయ సలహా అందించింది.
ఓ క్రైమ్ కేసుకు సంబంధించి నిందితుడికి బెయిల్ మంజూరు విషయంలో చాట్జీపీటీ సూచనలను అడిగి తెలుసుకున్నారు జడ్డీలు. బహుశా భారతీయ న్యాయవ్యవస్థలోనే ఈ సంఘటన మొదటిది కావచ్చు. ఇంతకీ చాట్జీపీటీని న్యాయమూర్తులు అడిగిన ప్రశ్న ఏంటి.. దీనికి ఏఐ ఇచ్చిన సమాధానమేంటో ఇప్పుడు చూద్దాం.
దుండగులు క్రూరత్వంతో ఇతరులపై దాడి చేసినప్పుడు.. అతడి బెయిల్ అభ్యర్థనపై న్యాయపరంగా మీరిచ్చే సలహా ఏమిటి? అని అడిగారు జడ్జిలు. దీనికి జీపీటీ స్పందిస్తూ.. క్రూరత్వం ద్వారానే మనిషి చంపుతున్నారు కాబట్టి బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తాను అని చాట్జీపీటీ బదులిచ్చింది.
ఓ దుండగుడు క్రూరత్వంతో ఓ వ్యక్తిపై శారీరక దాడి చేస్తే గనుక దాని తీవ్రతను బట్టి బెయిల్ మంజూరు చేసే విధివిధానాలు కూడా మారుతాయని చాట్జీపీటీ వివరించింది. నేరంలో ఉండే క్రూరత్వ తీవ్రతను బట్టి బెయిల్ మంజూరు చేయాలా వద్దా అన్నది ఆధారపడి ఉంటుందని ఏఐ చెప్పింది.
క్రూరత్వంతో వ్యవహరించే వ్యక్తుల ప్రభావం బాధితులపైనే కాకుండా సమాజానికి ప్రమాదకరమేనని చాట్జీపీటీ అభిప్రాయపడింది. దుండగుడి దాడి తీవ్రత, నిందితుడి నేర చరిత్ర, వీరికి వ్యతిరేకంగా దాఖలయ్యే సాక్ష్యాల బలం వంటి అంశాలు అతడికి బెయిల్ మంజూరు చేయాలా వద్దా అన్నది నిర్ణయిస్తాయని చాట్జీపీటీ బదులిచ్చింది.
మొత్తంగా నిందితుడు చేసే క్రూరమైన చర్య ఆధారంగా చట్టంలోని నిబంధనల ప్రకారం శిక్ష విధించడమో లేదా ఊరట కలిగించడమో చేయవచ్చని చాట్జీపీటీ సమాధానం ఇచ్చింది.
అలాగే తాను నిర్దోషినని నిరూపించుకోవడానికి ప్రతివాది వద్ద బలమైన సాక్ష్యాలు ఉంటే తప్ప అతడు బెయిల్కు పిటిషన్కు అర్హుడు కాడని చెప్పింది. అయితే నిందితుడి నేర ప్రవృత్తి, సత్ప్రవర్తనని న్యాయమూర్తులు పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయవచ్చని చాట్జీపీటీ సూచించింది.