తెలంగాణలో మార్పు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేతలు మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలపై జాతీయ నాయకత్వం సంతృప్తిని వ్యక్తం చేసిందన్నారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా కూడా తాము సిద్దంగా ఉన్నామని బండి సంజయ్ ప్రకటించారు. రాష్గ్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజా గోస కార్యక్రమాలను నిర్వహించనున్నట్టుగా ఆయన చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే 10 జిల్లాలో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని బండి సంజయ్ తెలిపారు. ఈ సభలకు మోడీని ఆహ్వనించాలని నిర్ణయించినట్టుగా సంజయ్ తెలిపారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించినట్టుగా బండి సంజయ్ చెప్పారు.
బీఆర్ఎస్ కు బీజేపీ మాత్రమే పోటీనని ప్రజలు భావిస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే ప్రజల ఆలోచనలకు నిదర్శనమని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. గత ఎన్నికల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన విషయాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు. తమకు నాయకులు లేకపోతే గత ఎన్నికల్లో 119 స్థానాల్లో అభ్యర్ధులను ఎలా నిలుపుతామని బండి సంజయ్ ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో కూడా తమ పార్టీ తరపున 119 మంది అభ్యర్ధులు పోటీ చేస్తారని ఆయన తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.
రెండు ఎంపీ సీట్లున్న బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన సమయంలో ఆయన పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇవాళ బీజేపీకి 300 ఎంపీలున్నారని సంజయ్ చెప్పారు. రానున్న రోజుల్లో ఏం చేయాలనే దానిపై కూడా రాష్ట్ర నేతల నుండి సూచనలు, సలహలను పార్టీ నేతలు తీసుకున్నారని ఆయన చెప్పారు. మంగళవారం జరిగిన సమావేశం రొటీన్ సమావేశంగా ఆయన పేర్కొన్నారు.