కరోనా కారణంగా కాలేజీలు సరిగ్గా నడవకపోయినా… వచ్చే విద్యా సంవత్సరాన్ని ఉన్నత విద్యామండలి ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా ఎంసెట్ తో పాటు ఇతర ప్రవేశ పరీక్షలనూ అప్పుడే నిర్వహించాలని భావిస్తోంది.
మామలుగా అయితే ప్రవేశ పరీక్షలు మే నెలలో ప్రారంభం అవుతాయి. మే చివరి నాటికి లేదా జూన్ వరకు ప్రవేశ పరీక్షలు కొనసాగుతుంటాయి. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా ఎంసెట్ సహా మరికొన్ని ఇతర ప్రవేశ పరీక్షలు సెప్టెంబరు, అక్టోబరు మొదటివారంలో జరిపారు. మరోవైపు కొవిడ్ ప్రభావంతో ఇప్పటివరకు జూనియర్ కళాశాలలు తెరుచుకోలేదు. ఆన్లైన్ తరగతులే కొనసాగుతున్నాయి.
ఈ పరిస్థితుల దృష్ట్యా ఈసారి ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ నెలాఖరులో ప్రారంభించి, మే రెండో వారానికి పూర్తిచేయాలని ప్రభుత్వం గత నవంబరులో సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాని తర్వాత కనీసం 15-20 రోజుల వ్యవధి ఇచ్చి జూన్లో ఎంసెట్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఇంటర్ పరీక్షలు ఎప్పుడనేది తేలాక ప్రవేశ పరీక్షలపై పూర్తి స్పష్టత వస్తుందంటున్నారు. ఇక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష జూన్ నెలాఖరు లేదా జులై మొదటివారంలో నిర్వహించే అవకాశం ఉంది.