తెలంగాణ సర్కార్ రైస్ మిల్లర్ల చెప్పు చేతల్లో పని చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వం రైతు మిల్లర్ల ఆధీనంలో పని చేస్తోందా లేక రైస్ మిల్లర్లు ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తున్నారా.. అని ఆయన ప్రశ్నించారు. అన్నదాతలు నిలువునా దోపిడీకి గురవుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు.
ప్రతి క్వింటాల్ కి ఐదు కిలోల దోపిడీ జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా రసీదు ఇవ్వడం లేదన్నారు. వరిధ్యానం కొనుగోలులో పచ్చి మోసం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులకు ఉన్న అన్ని రాయితీలు ఎత్తేసి కేవలం రైతు బంధు మాత్రమే ఇస్తున్నారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
విధిలేని పరిస్థితుల్లో రైతులు రోడ్డెక్కుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం పై నమ్మకం లేక రైతులే మిల్లర్లతో మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొని మే 31 లోపు ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇక ఎన్నికల సమయంలో కూడా ఇలా చేస్తున్నారంటే ప్రజల సంక్షేమంపై ప్రభుత్వ ఆలోచన ఏంటో అర్థం చేసుకోవచ్చని ఆయన విమర్శించారు. రైస్ మిల్లర్లను అదుపు చేయకపోవడం ప్రభుత్వం అసమర్థత అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.