రాష్ట్ర డీజీపీగా అంజనీ కుమార్ ను నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏసీబీ, విజిలెన్స్ డీజీగా ఉన్న ఆయనను డీజీపీగా బదిలీ చేసింది. ఈమేరకు ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నెలాఖరున ప్రస్తుత డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన స్థానంలో డీజీపీగా అంజనీకుమార్ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. గతంలో నగర పోలీసు కమిషనర్ గా పనిచేసిన అంజనీ కుమార్.. ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ డీజీగా ఉన్నారు.
అంజనీ కుమార్ 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2021 డిసెంబరు 24న ఏసీబీ డీజీ అయ్యారు. అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనర్ గా పని చేశారు. ఐక్యరాజ్య సమితి శాంతి మెడల్(పీస్ మెడల్) రెండుసార్లు అందుకున్నారు. ఐక్యరాజ్య సమితి తరఫున 1998-99లో బోస్నియా దేశంలో పనిచేశారు. బిహార్ రాజధాని పాట్నాలోని సెయింట్ జేవియర్ స్కూల్లో, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఐపీఎస్ ట్రైనింగ్ లో మంచి ప్రతిభ కనపబరిచి రెండు కప్పులు గెలుచుకున్నారు.
గతంలో జనగామ ఏఎస్పీగా పనిచేశారు అంజనీకుమార్. కౌంటర్ ఇంటిలిజెన్స్ సెల్ ఛీఫ్ గానూ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రేహౌండ్స్ ఛీఫ్ గా, నిజామాబాద్ డీఐజీగా పనిచేశారు. అలాగే వరంగల్ ఐజీగా, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు కమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా చేశారు. 2018 మార్చి 12న హైదరాబాద్ కమిషనర్ గా పని చేయగా.. 2021 డిసెంబరు 25న ఏసీబీ డీజీగా నియమితులయ్యారు.
రాష్ట్రపతి పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్ మెడల్, నక్సల్ ప్రాంతంలో పనితీరుకు గానూ.. ఇంటర్నల్ సెక్యూరిటీ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రపై విస్తృత పరిశోధన చేశారు.
మరోవైపు ఐదుగురు ఐపీఎస్ లను సైతం ప్రభుత్వం బదిలీ చేసింది. హోంశాఖ కార్యదర్శి రవిగుప్తాను ఏసీబీ డీజీగా బదిలీ చేసి.. విజిలెన్స్ డీజీగాను అదనపు బాధ్యతలు అప్పగించింది. శాంతి భద్రతల అదనపు డీజీ జితేందర్ హోంశాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు.