TSPSC పేపర్ లీక్ లపై మాట్లాడుతున్న బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు దమ్ముంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు నిరూపించుకోవాలంటూ సవాల్ విసిరారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్, బండి సంజయ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాలికి మాట్లాడి, బట్ట కాల్చి మీద వేయడం కాదంటూ మండిపడ్డారు. గుజరాత్ లో పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్లు శిక్ష విధించి ఆరోపణలు నిరూపించమని అడుగుతున్నామన్నారు ఎర్రబెల్లి. రాహుల్ కి ఒక నీతి, మీకు ఒక నీతి ఉంటుందా? అని ప్రశ్నించారు. కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాత్రి, పగలు అనే తేడా లేకుండా పనిచేస్తున్నారని చెప్పారు.
బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు నోటికి వచ్చినట్లు మాట్లాడి, పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారన్నారు. సరైన సమయంలో సరిగ్గా ప్రతిపక్షాలకు బుద్ధి చెప్తామన్నారు. టీఎస్పీఎస్సీ లీక్ కేసులో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుందన్నారు. ఎవరు దొంగలో.. ఎవరు దొరలో.. దర్యాప్తులో తేలుతుందన్నారు మంత్రి ఎర్రబెల్లి. సీఎం కేసీఆర్ మనసున్న మారాజు అని మరోసారి నిరూపించుకున్నారన్నారు.
దేశంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా నష్టపరిహారం 3,000 రూపాయలు కన్నా ఎక్కువ ఇవ్వలేదన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.5వేలు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పేదల పక్షాన నిలబడిందని తెలిపారు. ఎకరానికి నష్టపరిహారం దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.10 వేలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. సీఎంకు తెలంగాణ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నా అని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా పంటలకు నష్టపరిహారం ఇస్తున్నారా? అని నిలదీశారు.
సమృద్ధిగా నీరు, 24 గంటల కరెంటు, పంటలకు పెట్టుబడి, చివరకు పంటలు కొనుగోలు కూడా చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా?, దేశంలో రైతు బీమా ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్న సర్కార్ బీజేపీ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల పక్షాన పెద్ద రైతుగా నిలబడి ఉన్నారని చెప్పారు. దేశంలో ప్రజలంతా కేసిఆర్ కోసమే ఎదురు చూస్తున్నారు.. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ అంటూ నినదిస్తున్నారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని పేర్కొన్నారు మంత్రి ఎర్రబెల్లి.