బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర కార్యక్రమాలను సమన్వయ పరుస్తున్న పార్టీ ఇన్ చార్జిలు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అకాల వర్షాల వలన సమస్యలు ఎదుర్కొంటున్న రైతులను స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాలని ఆదేశించారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న రైతన్నలకు భరోసానిస్తూ.. విశ్వాసం కల్పించేలా వారితో మమేకం కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం వేగంగా చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ రోడ్ల బలోపేతం అంశంపైనా దృష్టి సారించాలని, వర్షాకాలం లోపల పనులు పూర్తయ్యేలా సమన్వయం చేసుకోవాలన్నారు. ఉపాధి హామీ, పట్టణ, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో వీటన్నింటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి హామీకి సంబంధించిన రూ.1300 కోట్లు కేంద్రం పెండింగ్ లో పెట్టడంతో బిల్లుల చెల్లింపులు ఆలస్యమైందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా కార్యకర్తలకు ఇస్తున్న సందేశాన్ని అన్ని ఆత్మీయ సమ్మేళనాల్లో చదివి వినిపించాలన్నారు. ప్రతీ గ్రామంలోని నాలుగైదు డివిజన్లకు కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనాలని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనాల్లో పార్టీ కార్యకర్తల ప్రాధాన్యత వారితో ఉన్న అనుబంధాన్ని వివరించేలా కార్యక్రమన్ని ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ఇంకా ఎక్కడైనా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ప్రారంభం కాకుంటే వెంటనే ప్రారంభం చేసుకోవాలని కార్యకర్తలకు, నాయకులకు కేటీఆర్ సూచించారు.
సమావేశాల్లో తెలంగాణ ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, వచ్చిన తర్వాత మారిన తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రం వంటి అంశాలను స్పృశించుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతీ కార్యకర్తకు అర్థమయ్యేలా వివరించాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు దేశంలో ప్రస్తుతం ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితుల పైన కూడా విస్తృతంగా మాట్లాడుకోవాలని కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వ హయాంలో పెరిగిన పెట్రోల్ ధరలు, నిత్యవసర సరుకుల ధరలు, మోడీ ప్రభుత్వ విధానాల వైఫల్యాలు వంటి వాటిని మన కార్యకర్తలకు అర్థమయ్యేలా చర్చించి, ప్రజా బహుల్యంలోకి వాటిని తీసుకువెళ్లేలా చూడాలని కేటీఆర్ ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు రాష్ట్రస్థాయి నాయకులు, పార్టీ నేతలు ప్రత్యేక అతిథులుగా హాజరవుతారని, ఏప్రిల్ 20న నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకుంటే ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గస్థాయిలో పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించుకోబోతున్నామన్నారు. ఒక్కో పార్టీ ప్రతినిధుల సమావేశంలో 1000 నుంచి 1500 మంది పార్టీ ప్రతినిధులతో ఈ సమావేశాలు ఉండనున్నాయన్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతీ గ్రామంలో, ప్రతీ వార్డులో జెండా పండుగ కార్యక్రమం ఉంటుందన్నారు. ఏప్రిల్ 7వ తేదీన పార్టీ ప్లీనరీ జరుగుతుందని, దీనికి పార్టీ ఆహ్వానించిన ప్రతినిధులు మాత్రమే హాజరవుతారని వివరించారు మంత్రి కేటీఆర్.