నిజ్జన రమేష్ ముదిరాజ్, TJS పార్టీ స్టూడెంట్ వింగ్ స్టేట్ కన్వీనర్…
*తెలంగాణలో ఐదు ప్రయివేట్ యూనివర్సిటీలు.. మూడు టీఆర్ఎస్ నేతలవే!* భావితరాల పేద విద్యార్దులకు సర్కారు కొలువు కలగానే మిగిలిపోనుంది……
తెలంగాణ రాష్ట్రంలో ఐదు ప్రయివేట్ యూనివర్సిటీలు ఏర్పాటు కాబోతున్నాయి. వీటిలో మహీంద్రా, వోక్సెన్ మినహా మిగతా మూడు యూనివర్సిటీలు టీఆర్ఎస్ నేతలకు సంబంధించినవే.
తెలంగాణలో ప్రయివేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. బుధవారం కేసీఆర్ సర్కారు తెలంగాణ స్టేట్ ప్రయివేట్ యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్) సవరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీనికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. ఈ ఆర్డినెన్స్ ప్రకారం రాష్ట్రంలో ఏర్పాటయ్యే ఒక్కో ప్రయివేట్ యూనివర్సిటీకి ప్రత్యేక చట్టాలను రూపొందించొచ్చు. కేసీఆర్ సర్కారు ఇదివరకే తెలంగాణ స్టేట్ ప్రయివేట్ యూనివర్సిటీస్ యాక్ట్ – 2018ను తీసుకొచ్చింది.
ప్రయివేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రభుత్వం గెజిట్ జారీ చేయడంతో.. కుత్బుల్లాపూర్ మండలం బహదూర్ పల్లిలో మహీంద్రా యూనివర్సిటీ, మెదక్ జిల్లా సదాశివపేట మండలంలో వోక్సెన్ యూనివర్సిటీ.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దూలపల్లి ఏరియా మైసమ్మగూడలో మల్లారెడ్డి యూనివర్సిటీ, వరంగల్ జిల్లా హసన్పర్తి మండలం అనంతసాగర్లో ఎస్ఆర్ యూనివర్సిటీ, ఘట్కేసర్ మండలం వెంకటాపూర్లో అనురాగ్ యూనివర్సిటీ ఏర్పాటు కానున్నాయి.
ఈ ఐదింటిలో మూడు టీఆర్ఎస్ నేతలకు చెందినవే కావడం గమనార్హం. మల్లారెడ్డి యూనివర్సిటీ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినది కాగా.. అనురాగ్ యూనివర్సిటీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సంబంధించినది, ఎస్ఆర్ యూనివర్సిటీ గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రేసులో ఉన్న వరదా రెడ్డిదని ప్రచారం జరుగుతోంది.
ఇన్నాళ్ళు మనం ప్రయివేటు పాఠశాలలు చూసాం, కళాశాలలు చూసాం, నేడు కొత్తగా ప్రయివేటు విశ్వవిద్యాలయాలు చూడబోతున్నాం. గతంలో అన్ని సర్కారు బడులున్న కాలంలో అన్ని రకాల కులాలు, మతాలకు చెందిన విద్యార్థులందరికీ ఒకే రకమైన చదువు చెప్పబడేది. ప్రభుత్వ పాఠశాల పని తీరు అద్భుతంగా ఉండి ఫలితాలు కూడా అంతే మొత్తంలో ఉండేవి. ఎక్కడ ప్రభుత్వ పాఠశాలలు విఫలం చెందలేదు, తర్వాత ప్రభుత్వమే ఉన్నవారి చదువు కోసం ప్రయివేటు పాఠశాలలు తీసుకొచ్చి పరోక్షంగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడం జరిగింది. వాటిలో మౌలిక సదుపాయాలు కాని, ఉపాధ్యాయులను నియమించక పోవడం లాంటి చర్యల వలన ప్రయివేటు పాఠశాలలను ప్రజలు ఆదరించేలా చేసింది. ప్రజల ముందు ప్రభుత్వ ఉపాధ్యాయులను విలన్లు గా చిత్రీకరించే ప్రయత్నాలు చేసింది.
తర్వాత ప్రయివేటు కళాశాలలకు అనుమతులివ్వడం జరిగింది. అప్పుడు కూడా వీటి పట్ల ఎవరు నిరసన తెలుపలేదు. గత ప్రభుత్వాలు ఫీజు రీఇంబర్స్ ఇవ్వడం మూలాన విచ్చల విడిగా పుట్టగొడుగులు లాగా వేల కోళ్ల ఫారమ్ లు కళాశాలలు గా మారిపోయాయి. నేడు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి ప్రయివేటు యూనివర్సిటీ లు తీసుకువచ్చింది. కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని గద్దెనెక్కి నేడు ప్రయివేటు యూనివర్సిటీ లకు అనుమతులివ్వడం జరిగింది. దీని వలన ఏ వర్గాల కు నష్టం. అంటే మెజారిటీ గా ఉన్న మధ్య తరగతి మరియు పేద తరగతులకు తీరని నష్టం.
ఎందుకంటే ఒక పీజీ చేయాలి అంటే ప్రస్తుతం కనీసం 5 నుండి 6 లక్షల డొనేషన్ కట్టాలి. ఇంత మొత్తం లో కట్టడం ఏ వర్గాల వారికి సాధ్యం అవుతది. అంతే కాకుండా ఇందులో చదివిన చదవక పోయినా నకిలీ ధృవీకరణ పత్రాలు పొందడం ఉన్నవారికి మరియు దీన్ని స్థాపించిన వారి బందు మిత్రులందరికీ సులభం అవుతాయి. అంటే ధృవీకరణ పత్రాలు చాలా సులభంగా దొరుకుతాయి. ఇక మార్కుల విషయంలో తమ వారికి ఎక్కువ మార్కులు వేస్తారు. ఎందుకంటే సంస్థ పదికాలాల పాటు మనగలగాలి అంటే ఆ యూనివర్సిటీ లో చదివిన వారికి ఎక్కువ మార్కులు వస్తే నే కదా. ప్రభుత్వ యూనివర్సిటీ లో చదివిన వారి మార్కులు కూడా ప్రయివేటు యూనివర్సిటీ లో చదివిన వారితో పోలిస్తే తక్కువ గా ఉంటాయి. ముందు ముందు ఏ ఉద్యోగం పొందాలన్నా దానికి అకాడమిక్ మార్కులను కొలమానంగా నిర్ణయిస్తారు, కావున ప్రభుత్వ యూనివర్సిటీ లో చదివిన వారు ఉద్యోగాలు పొందడం కష్టమే. తెలంగాణ రాష్ట్రం సాధించి 6 సంవత్సరాలు పూర్తవుతుంది. నేటికి జూనియర్ కాలేజి నుండి మొదలుకుంటే యూనివర్సిటీ స్థాయి వరకు ఒక్క అధ్యాపకున్ని నియమించింది లేదు. ఎంతోమంది పీహెచ్ డీ పట్టాలతో ఈ నియామకాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు స్థాపించ పోతున్న ప్రయివేటు యూనివర్సిటీ ల వలన ఇక నియామకాలు చేపట్టడం అనేది జరగని పని. నాన్ టీచింగ్ ఉద్యోగాలను కూడా ఇంతవరకు నియమించలేదు. అంటే ప్రభుత్వమే కుట్ర పూరితంగా యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నాయి. దీనికి గల కారణం పేద ప్రజలందరు ఈ యూనివర్సిటీ లో చదివి కొలువు లు రాక ఉద్యమాలు, మరియు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ యూనివర్సిటీ లను ఉద్యమ కేంద్రాలు గా చేసుకుంటున్నారనేది ఒక కారణం అని ప్రభుత్వం లో ఉన్నత వర్గాలకు సంబందించిన పెద్దల వాదన, అయితే ఇప్పుడున్న పరిస్థితి లో ఉన్నత వర్గాల పిల్లలు ఈ యూనివర్సిటీ లలో చద వకపోవడం మరో కారణం అని చెప్పొచ్చు. ఉన్న వాడు మరింత ఉన్నతంగా మారేందుకే ఈ ప్రయివేటు యూనివర్సిటీలు. అందుకే రానున్న రోజుల్లో పీడిత వర్గాల వారికి కొలువులు రావడం కష్టమే. పేదవారందరూ అటెండర్ కొలువులకు మాత్రమే పరిమితం అవుతారు. ఉన్నత వర్గాల వారి పిల్లలే పై స్థాయి కొలువులు పొందుతారు. అందుకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రయివేటు యూనివర్సిటీలను అడ్డుకోక పోతే పీడిత వర్గాల వారి మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలిపోనుంది. అందుకే విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, బుద్ధి జీవుల్లారా ఈ ప్రయివేటు యూనివర్సిటీ ల స్థాపన కుట్రలను అడ్డుకుందాం, భావి తరాల యువత అభ్యున్నతికై పాటు పాటుపడుదాం…..