మునుగోడు బై ఎలక్షన్స్ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలవుతుందని, కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్. మునుగోడులో ఉప ఎన్నికల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ రాజకీయ పార్టీ నేతలైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఎలక్షన్ గైడ్ లైన్స్ ప్రకారం అన్ని టీమ్ లతో కలిసి కో ఆర్డినేషన్ చేసుకుంటూ పని చేస్తున్నామని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన ఏర్పాట్లు, నామినేషన్ ప్రక్రియ తదితర విషయాల గురించి ఆయన తెలిపారు.
మునుగోడు బై ఎలక్షన్స్ కు సంబంధించి ఈ నెల 14 నామినేషన్లకు తుది గడువు విధించామని, వచ్చే నెల 3న ఎన్నిక జరగనుందని, 6న ఫలితాలు వెలువడుతాయని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మునుగోడు నియోజవర్గంలో ఇప్పటి వరకు 2 లక్షల 34 వేల మంది ఓటర్లు ఉన్నారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందన్నారు. ఎలక్షన్ కోసం మొత్తం 294 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. సిబ్బంది, ఈవీఎంలు ఈ నెల 12 వరకు మునుగోడుకు చేరుకుంటాయని స్పష్టం చేశారు.
ఈ ఎన్నిక కోసం మొత్తం 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఏడు మండలాల్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని, అక్కడ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎన్నిక సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటి వరకు 40 లిక్కర్ షాపులను సీజ్ చేశామని ఆయన వెల్లడించారు.
మునుగోడులో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం సరఫరా జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదని, ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇక ఈ ఎన్నిక కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి పరిశీలకులు వస్తారని, నియోజకవర్గంలోని పరిస్థితులపై వారు మానిటరింగ్ చేస్తారని వికాస్ రాజ్ చెప్పారు. అలాగే నామినేషన్ నుంచి ఎన్నిక పూర్తై కౌంటింగ్ వరకూ సీసీ కెమెరాలు, వెబ్ కెమెరాలతో ప్రతిదీ చిత్రీకరిస్తామని చెప్పారు సీఈవో వికాస్ రాజు.