తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. బహుళ సమాధానాల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. 7 ప్రశ్నలకు సంబంధించి అభ్యర్థులకు మార్కులు కలపాలని నిర్ణయానికి వచ్చింది.
కోర్టు తీర్పు ప్రకారం ఉత్తీర్ణులైన వారి జాబితాను ఈ నెల 30 నుంచి వెబ్సైట్లో పెట్టనున్నారు. ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల కోసం రిక్రూట్ మెంట్ బోర్డు ఇప్పటికే ప్రిలిమినరి పరీక్షలు నిర్వహించింది. దీనికి సంబంధించి ఫలితాలను కూడా విడుదల చేసింది.
ప్రిలిమినరీ ప్రశ్నాపత్రంలో కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలున్నాయి. నెగెటివ్ మార్కుల నేపథ్యంలో చాలా మంది వాటి అయోమయానికి గురై వాటికి సమాధానాలు పెట్టలేదు. కానీ తాము బోర్డు మాత్రం తాము నిర్దారించిన సమాధానాల ప్రకారం మార్కులు వేసి ఫలితాలు ప్రకటించింది.
దీంతో కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు బహుళ సమాధాలున్న ప్రశ్నలకు అదనపు మార్కులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా హైకోర్టు ఆదేశాలను అమలు చేయనుండటంతో మరి కొందరు అభ్యర్థులు దేహదారుడ్య పరీక్షలకు అర్హులు కానున్నారు.
తాజాగా దేహదారుఢ్య పరీక్షలకు (పార్ట్-2కు) ఎంపికయ్యే అభ్యర్థుల వివరాలను రేపటి నుంచి వెబ్సైట్లో పెట్టనున్నట్లు బోర్డు పేర్కొంది. హాల్ టికెట్ నంబర్లతోనే అభ్యర్థులు లాగిన్ అయ్యేందుకు అవకాశం కల్పించింది. వారికి పార్ట్ 2 దరఖాస్తులు ప్రారంభమవుతాయని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.
ఫిబ్రవరి 5 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. పార్ట్-2కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 10 రాత్రి 12 గంటల వరకు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.