రాష్ట్రంలో దళిత బంధు మాదిరిగా గిరిజన బంధు కూడా ఇస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ నెలలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ఈ రోజు మాట్లాడుతూ…..
గుత్తికోయలు చాలా ఆటవికంగా ప్రవర్తిస్తున్నారని ఆయన చెప్పారు. ఫారెస్టు అధికారి శ్రీనివాస రావును గుత్తికోయలు చంపడం కరెక్టేనా? అని ఆయన ప్రశ్నించారు. పోడు భూములంటే దురాక్రమణేనని ఆయన స్పష్టం చేశారు. అడవులను నరికేయడం సరైంది కాదన్నారు.
ఈ విషయంపై ప్రతిసారీ రాజకీయం చేయడం అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. గత ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోలేదని ఆయన ఫైర్ అయ్యారు. పోడు భూముల సమస్య న్యాయమైన డిమాండ్ అని ఆయన వెల్లడించారు. ఈ నెలలోనే పోడు భూములకు పట్టాలిస్తామన్నారు.
రాష్ట్రంలో 11 లక్షల పోడు భూములకు పట్టాలు ఇవ్వనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇదేదో ఎన్నికల కోసం చేసే దందా కాదన్నారు. రాష్ట్రంలో గ్రీన్ కవర్ 7.8కి పెరిగిందని ఆయన వివరించారు. ఇప్పుడు పోడు భూములను సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇస్తామన్నారు.
కానీ ఇది ఇలాగే కొనసాగడం సరికాదన్నారు. దీనికి ముగింపు తీసుకు రావాలన్నారు. మరోసారి అటవీ భూములను ధ్వంసం చేస్తే పట్టాలు వెనక్కి తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాగే భూమి లేని వారికి గిరిజన బంధు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.