గుంటూరు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఈనెల 24వ తేదీన సమావేశం కానున్నారని సమాచారం. గోదావరి జలాలను శ్రీశైలానికి ఎలా తరలించాలనే అంశంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారని తెలిసింది. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా వున్న విభజన అంశాలపై ఉభయులూ చర్చించే అవకాశం ఉంది. గతంలో గోదావరి నీటిని శ్రీశైలం జలాశయానికి తరలించే వ్యూహం ఖరారు చేయాలని ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లకు ఇందులో అవకాశం కల్పించారు. ఎక్కడి నుంచి ఎలా నీరు తరలించాలన్న విషయంపై నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. ఐతే, తెలంగాణ భూభాగం నుంచి గోదావరి నీటిని తరలించాలని ఏపీ ఇంజనీర్లు, ఏపీలో మరో రిజర్వాయర్ నిర్మాణం చేస్తూ.. కాల్వలను వెడల్పు చేయడం ద్వారా నీటిని నాగార్జునసాగర్, అక్కడి నుంచి శ్రీశైలం తరలించవచ్చునని తెలంగాణ అధికారులు వేర్వేరు ప్రతిపాదనలు రూపొందించారు. ఒకరి ప్రతిపాదనలు ఒకరికి నచ్చకపోవడంతో ఈ అంశం అప్పటికి ఆగిపోయింది. దీనిపై ఇప్పుడు కేసీఆర్ పట్టుబడుతున్నట్టు సమాచారం. ప్రాజెక్టు పూర్తి కాకుండానే కాళేశ్వరం ప్రాజెక్టును హడావుడిగా ప్రారంభించారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుండటంతో గోదావరి జలాలను దిగువ రాష్ట్రంతో ఇబ్బంది లేకుండా తెలంగాణాకు పూర్తిగా మళ్లించే ఆలోచనతో ఆయన వున్నారని అంటున్నారు. ఏపీ భూభాగంలో పట్టిసీమ నిర్మాణానికే గతంలో అనవసరమని రాద్ధాంతం చేసిన వైసీపీ నేత వేరే రాష్ట్ర భూభాగం నుంచి రెండు నదుల అనుసంధానం చేయడానికి రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుగా దీన్ని ఎలా చేపడతారని టీడీపీ నిలదీస్తోంది. మొత్తం మీద మరో వివాదానికి సంబంధించిన ఇష్యూపై ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు 24న జరగనున్న సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.