వారానికిపైగా ఉక్రెయిన్ లో ఏకధాటిగా దాడులకు పాల్పడిన రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాల్పులు, బాంబులతో విరుచుకుపడుతున్న రష్యా.. ప్రపంచదేశాల ఒత్తిడితో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించింది. మానవతాధృక్పథంతో భారతీయ కాలమానం ప్రకారం ఈ ఉదయం 12.30 నుంచి కాల్పులు విరమించినట్టు రష్యా ప్రకటించింది.
కీవ్ తోపాటు ఉక్రెయిన్ లోని ఖర్కీవ్, మరియుపోల్, సుమీ నగరాల్లో కాల్పులను ఆపుతున్నామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయేల్ మక్రాన్ రిక్వెస్ట్ చేయడంతో నేడు కాల్పులను తాత్కాలికంగా నిలిపేశామని పేర్కొంది. దీంతో ఆయా నగరాల్లో ఉన్న భారతీయులతో పాటు ఇతర దేశస్తులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం లభిస్తుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఇప్పటికే ఖర్కీవ్, మరియుపోల్, సుమీల్లో రష్యా భీకరంగా దాడులు చేస్తోంది. దీంతో అక్కడి నుంచి విదేశీయులు పశ్చిమ ప్రాంతాలకు వెళ్లి ఉక్రెయిన్ సరిహద్దు దాటే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ప్రపంచ దేశాలు మానవతా కారిడార్ ఏర్పాటు చేయాలని రష్యాను కోరుతున్నాయి.
ఈ నేపథ్యంలో రష్యా కాల్పుల విరమణ నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో కూడా రెండు నగరాల్లో ఇలాగే కాల్పుల విరమణ నిర్ణయం తీసుకుంది రష్యా. ప్రస్తుతం సుమీ ప్రాంతంలో 700 మంది దాకా భారతీయులు ఉన్నట్లు విదేశాంగ శాఖ చెప్తోంది. ప్రస్తుతం కాల్పుల నిర్ణయంతో అక్కడి నుంచి భారతీయులు సురక్షితంగా బయటపడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.