కామారెడ్డిలో మళ్లీ టెన్షన్ మొదలైంది. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ముందు రైతులు బైఠాయించారు.
దీంతో వందల సంఖ్యలో పోలీసులు కూడా అక్కడికి చేరుకొని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే కొందరు బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ఘటనలు పునరావృత్తం కాకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.
అయితే కామారెడ్డి టౌన్ ప్లానింగ్ పై గత కొన్ని రోజుల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు రావడంతో పాటు, ప్లాన్ మార్చాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే 1,026 అభ్యంతరాలు వచ్చాయి. ఇంకా కూడా వచ్చే అవకాశముంది. ప్లాన్ లో ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్, 100 ఫీట్ల రోడ్డు పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆయా గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు మున్సిపాల్టీతో పాటు, కలెక్టర్ కు అభ్యంతరాలు ఇచ్చారు.
అయితే మూడు రోజుల రైతుల ఆందోళనతో పాటు బీజేపీ, కాంగ్రెస్ ముట్టడి తరువాత కామారెడ్డి కలెక్టర్ స్పందిస్తూ.. అది కేవలం డ్రాఫ్ట్ మాత్రమేనని.. అన్నదాతల భూమికి ఎలాంటి నష్టం చేకూరదని చెప్పారు. దీంతో కామారెడ్డి అన్నదాతల ఐకాస కాస్త.. రెండుమూడ్రోజుల పాటు శాంతించింది. మళ్లీ ఈ రోజు మున్సిపాల్టీ కార్యాలయం దగ్గర మాస్టర్ ప్లాన్ ను పూర్తిగా రద్దు చేయాలని రైతులు బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది.