రాజస్థాన్ లో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. రంజాన్ సందర్భంగా ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణతో జోద్పూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో కర్ఫ్యూ విధించారు పోలీసులు. జోధ్పూర్లో జరిగిన మతఘర్షణలతో లింకు ఉన్న 211 మందిని అరెస్టు చేశారు పోలీసులు.
ఈ ఘటనపై మొత్తం 19 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. ఈద్ పండుగ సంబరాలకు ముందు జోధ్పూర్ లో రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో మొత్తం 211 మందిలో.. 191 మందిపై ఐపీసీ 151 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేసినట్టు స్పష్టం చేశారు.
జోధ్పూర్లో పరిస్థితి అదుపులో ఉన్నట్లు రాజస్థాన్ డీజీపీ ఎంఎల్ లాథర్ తెలిపారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు ఏసీపీ చక్రవర్తి సింగ్ రాథోడ్ తెలిపారు. మే 6 వరకు జోధ్పూర్ లో కర్ఫ్యూను అమల్లో ఉంటోందని పేర్కొన్నారు.
నగరంలోని జలోరీ గేట్ సర్కిల్ వద్ద మతపరమైన జెండాలను ఆవిష్కరించే అంశంలో రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. దీంతో రెండు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడ మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు పోలీసులు.