టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పర్యటనకు సిద్దం అయ్యారు చంద్రబాబు. అయితే ఆయన పర్యటనకు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు పోలీసులు.
శాంతిపురం మండలంలో వందల మంది పోలీసులు మోహరించారు. దీంతో శాంతిపురం మండలం గడ్డురు క్రాస్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. టీడీపీ వాహన డ్రైవర్లపై పోలీసులు చేయి చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. పార్టీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు పోలీసులు. టీడీపీ ప్రచారం రథం, సౌండ్ వాహనం పోలీసు స్టేషన్ కు తరలించి.. డ్రైవర్లు, సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
పర్యటనలో సౌండ్ సిస్టమ్ కోసం అనుమతి కోరుతూ ఇప్పటికే టీడీపీ నేతలు పోలీసులకు లేఖలు కూడా ఇచ్చామని చెబుతున్నారు. మరో వైపు.. కెనామాకులపల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన స్టేజీని సైతం తొలగించారు. పోలీసులు.. చంద్రబాబు పర్యటించే తొలి గ్రామంతో సహా మండలంలోని అన్ని చోట్ల భారీగా మోహరించారు.
ప్రతి గ్రామంలో, కూడళ్లలో పదుల సంఖ్యలో పోలీసు వాహనాలు, అదనపు బలగాలను దింపారు. మూడు రోజుల పాటు కుప్పం నియోజక వర్గంలో పర్యటించనున్నారు బాబు. రోడ్లపై సభలు, ర్యాలీలను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో.. ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ కొనసాగుతుంది.
అయితే ప్రభుత్వ నిర్ణయం ప్రకారం జాతీయ, రాష్ట్ర, పంచాయతీ, మున్సిపల్ రోడ్లపై సభలు,రోడ్ షోలు,ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తీసుకోనున్నారు. రోడ్లకు దూరంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే ప్రదేశాలు ఎంపిక చేయాలని ఆదేశాల్లో పేర్కొంది సర్కార్. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో చంద్రబాబు ఎలా ముందుకు సాగుతారనేది ఆసక్తికరంగా మారింది.