ఉస్మానియా క్యాంపస్ లో జేఏసీ చేపట్టిన నిరుద్యోగ మార్చ్ ఇంకా మహా దీక్ష నేపథ్యంలో జూబ్లిహిల్స్ లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేవంత్ ఇంటికి వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసివేశారు.
అక్కడికి వస్తున్న విద్యార్థులను కూడా అడ్డుకుంటున్నారు. అయితే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరగనున్న నిరుద్యోగ మహాదీక్షకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఆహ్వానం మేరకు రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మరో వైపు ఈ నిరసన కార్యక్రమానికి ఓయూ అధికారులు కాని పోలీసులు కాని అనుమతించలేదు. దీంతో రేవంత్ రెడ్డి ఓయూ కు వెళ్లకుండా పోలీసులు ముందుగానే అడ్డుకున్నారు.
ఇక ఇలా ఉంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జేసీఏ నాయకులను అదుపులో తీసుకుంటున్నారు. రెండ్రోజుల పాటు క్యాంపస్ లో హై అలర్ట్ ప్రకటించారు. ఓయూలో విద్యార్థి నాయకులను వసతి గృహల్లోనే పోలీసులు నిర్భందిస్తున్నారు. మరో వైపు క్యాంపస్ లోకి వస్తున్న విద్యార్థుల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. క్యాంపస్ కి వచ్చే అన్ని గేట్లను ఓయూ సెక్యూరిటీ మూసివేశారు.
ఎవరిని లోనికి అనుమతించడం లేదు. అయితే ఈ అరెస్టులపై విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. పేపర్ లీకేజీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. టీఎస్సీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని అదే విధంగా జ్యూడీషియల్ విచారణకు విద్యార్థులు పట్టుపడుతున్నారు.