మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. కురవి గ్రామంలో మృతుల బంధువులు నిరసనకు దిగారు. గ్రానైట్ ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాలతో కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
కురవి ప్రాంతంలో నిన్న టిప్పర్ లారీ నుంచి భారీ గ్రానైట్ రాయి ఆటో మీద పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ప్రమాదంలో తాము పెద్ద దిక్కును కోల్పోయామంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
దీంతో 365వ జాతీయ రహదారిపై మహబూబాబాద్ – మరిపెడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో మృతుల కుటుంబ సభ్యులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది.