కామారెడ్డిలో మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంటుంది. షబ్బీర్ అలీ సహా 100 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను నిరసిస్తూ రైతుల బంద్ కు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ చేపట్టింది. ఇందిరా చౌక్ వద్ద ఉద్రిక్తత వాతారణం నెలకొంది. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. షబ్బీర్ అలీ, కిసాన్ కేత్ రాష్ట్ర నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు ధర్నా ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
మాజీ మంత్రి షబ్బీర్ అలీ,కిసాన్ కేత్ జాతీయ నేత కోదండ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి సహా 100 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే షబ్బీర్ అలీని తరిలించే వాహనానికి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు బైఠాయించి అడ్డుకున్నారు. అయినా కాని పోలీసు వాహనంలో షబ్బీర్ అలీని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
కాగా, కొత్త మాస్టర్ ప్లాన్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతు జేఏసీ ఇవాళ కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు కాంగ్రెస్, బీజేపీలు మద్దతు ప్రకటించాయి. అయితే నిన్న జిల్లా కలెక్టర్ రైతు ఆందోళనను అవమానించారని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ మండి పడ్డారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ను సవరిస్తామని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తీరు దున్నపోతు పై వర్షం పడ్డట్లు ఉందని విమర్శించారు. మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రభుత్వం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. కామారెడ్డి రైతుల భూముల్లో ఇండస్ట్రియల్ ప్రతిపాదన రద్దు చేయాలని, మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటన చేసే వరకు ఉద్యమం ఆగదన్నారు. అయితే కామారెడ్డిలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది.