ఇండియాలో టెస్లా కార్ల తయారీ కేంద్రం ఎప్పుడు వస్తుందనే దానిపై టెస్లా కంపెనీ సీఈవో ఎలన్ మస్క్ క్లారిటీ ఇచ్చారు. తమ దేశంలో టెస్లా కార్ల తయారీ కేంద్రం పెట్టాలనిసైతం కేంద్రం కంపెనీ ప్రతినిధులను కోరింది. భవిష్యత్తులో ఇండియాలో టెస్లా కంపెనీ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందా..? లేదా..? అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు మస్క్ ట్విట్టర్ లో బదులిచ్చారు.
తొలుత తమ కార్లను అమ్మడానికి అనుమతి ఇవ్వకున్నా.. తమ కార్లకు సర్వీస్ చేసే అవకాశం ఇవ్వకున్నా.. అలాంటి దేశాల్లో తాము ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయబోమని స్పష్టం చేశారు ఆయన. వాస్తవానికి టెస్లా కార్లపై అధిక స్థాయిలో దిగుమతి సుంకం చెల్లించాల్సి వస్తోందని వెల్లడించారు.
ఎలక్ట్రానిక్ వాహనాలకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో.. మస్క్ కామెంట్ కొంత నిరాశనే మిగిల్చింది. అయితే టెస్లా కంపెనీ తమ కార్ల తయారీ కేంద్రాన్ని ఇండియాలో స్థాపించుకునేందుకు తాము అవకాశం ఇస్తామని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
కానీ.. చైనాలో తయారైన కార్లను ఇక్కడ అమ్మనివ్వమని ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో మస్క్ ఇచ్చిన వివరణతో టెస్లా, భారత్ మధ్య అగాధం పెరిగింది. ఇతర దేశాల్లో తయారు చేసిన కార్ల విక్రయాలు కాకుండా నేరుగా భారత్ లో టెస్లా కంపెనీ కార్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దానికి టెస్లా కంపెనీ ప్రతినిధులు నిరాకరించారు.