గుజరాత్లోని బనాస్కాంఠ జిల్లాలోని ఠాకోర్ సమాజ్ సభ్యులు కొత్త రూల్స్ షురూ చేసారు. భాభార్ తాలూకాలోని లున్ సేలాలో ఇటీవల జరిగిన సంత్ శ్రీ సదరమ్ బాపా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో సరికొత్త రూల్స్ కి శ్రీకారం చుట్టారు.
ఇవి కాస్త వింతగా ఉండడమే కాదు నవతరం అమ్మాయిల సెల్ ఫోన్ స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా ఉంది. ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ ఫోన్ ఎంత అత్యవసరం అయిపోయిందో ప్రత్యేకంగాచెప్పనక్కర్లేదు.
అలాంటి ఈ కాలంలో పెళ్లికాని అమ్మాయిలు ఫోన్ వినియోగించడానికి అనుమతి ఇవ్వంద్దంటూ వింత నిబంధన పెట్టారు. దీనితో పాటు మరో 11 వింత నిబంధనలను రూపొందించింది ఠాకోర్ సమాజ్.
తమ సంఘంలో సంస్కరణలు తీసుకురావడానికి 11 నియమాలను ప్రవేశపెట్టారు. తమ కమ్యూనిటీ ప్రజలు ఈ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ఠాకోర్ సమాజ్ సభ్యులు.. ఈ 11 నియమాలను అందరూ పాటించాలని సీరియస్ తీర్మానం చేశారు.
1. వివాహాలలో డీజేలపై పూర్తి నిషేధం.
2. పెళ్లిలో బహుమతులకు బదులుగా నగదు ఇచ్చుకోవాలి.
3. పెళ్లికి వరుడు, వధువు రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువులను మాత్రమే బహుమతిగా ఇవ్వాలి.
4. నిశ్చితార్థానికి 11 మంది అతిథులు మాత్రమే హాజరు అవ్వాలి.
5.వివాహా కార్యక్రమానికి 51 మంది అతిథులు మాత్రమే హాజరు కావాలి.
6. సామాజిక వర్గాల వారీగా కమ్యూనిటీ వివాహాలు నిర్వహించాలి.
7. నూతన వధూవరులు.. బంధువుల ఇంటిని సందర్శించినప్పుడు వారికి డబ్బును ఇవ్వకూడదు.
8. నిశ్చితార్థం, వివాహాన్ని రద్దు చేసినందుకు శిక్షలు విధించకూడదు.
9. పెళ్లికాని అమ్మాయిలకు మొబైల్ ఫోన్ను ఉపయోగించడానికి అనుమతి ఇవ్వకూడదు.
10. మత్తు పదార్థాలకు బానిసలైన వారి కోసం డీ-అడిక్షన్ క్యాంపులు ఏర్పాటు చేయాలి.
11. బాలికలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.