తెలంగాణలో మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఎన్నిలకు షెడ్యూల్ విడుదల చేసింది.
దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికంగా మారింది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని గతంలో ఎంఐఎంకు బీఆర్ఎస్ కేటాయించగా.. ఈ సారి కూడా ఎంఐఎంకే మద్దతు ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీకి మిత్రపక్షంగా ఎంఐఎం ఉంది. దీంతో ఆ పార్టీకే హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గత తొమ్మిదేళ్ళుగా బీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు తెలుపుతూ వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మజ్లిస్ మద్దతులోనే బీఆర్ఎస్ గట్టెక్కింది.
దీంతో కేసీఆర్ ఆ సీటును ఎంఐఎంకే అప్పగించారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ మధ్యే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించడం వెనుక అసలు కారణం ఇదేనని అంటున్నారు. ఇక ఇలా ఉంటే ముస్లిం ఓట్లు చీలిపోతే బీఆర్ఎస్ కు కూడా నష్టం కలిగే అవకాశముంది. వీటిన్నింటి మధ్య ఆ సీటును ఎంఐఎంకే కేటాయించడం ఉత్తమం అని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది.